హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల (BRS Leaders) పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి తనిఖీలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
జేసీ బ్రదర్స్ షోరూమ్స్ తో పాటు అమీర్ పేట్ లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్దన్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల పరిశ్రమలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమణులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురూ కలిసి పలు కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పైళ్ళ శేఖర్ రెడ్డికి సంబంధించిన బ్యాంకు లాకర్స్ ను సైతం ఐటీ అధికారులు తెరిచారు. మరోవైపు ఐటీ అధికారుల సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.