రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వానలు విరివిగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి కొద్దిరోజులుగా కొనసాగుతోంది. రోహిణి కార్తెలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని .. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్ మహా నగరంతోపాటు.. మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వరంగల్, భూపాలపల్లి, హనుమకొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
కాగా.. హైదరాబాద్ లో ఈ ఉదయాన్నే చిరుజల్లులు కురిశాయి. అయితే, వర్షాలు కురిసినా పగటిపూట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 40°C నుంచి 43°C మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని.. పేర్కొంది. హైదరాబాద్ నగరంలో 38°C నుంచి 41°C మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. మరోవైపు
ఏపీలో కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతోపాటు.. అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.